mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 12:15 pm Digital Edition : Namastey Mahaaprabha

రైలు మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా?

రైలును మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఈ విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : సాధారణంగా రైలు మిస్ అవ్వడానికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు సమయానికి బయలుదేరకపోవడం ప్రధాన కారణం. ఇంటి నుంచి స్టేషన్ దూరంగా ఉండటం, మార్గంలో ట్రాఫిక్ జామ్‌ అవ్వడం వల్ల ఆలస్యం కావచ్చు. అయితే, ఒక రైలు మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా.. లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

30 నుంచి 45 నిమిషాల ముందు

రైలులో ప్రయాణించాల్సి ఉంటే సాధారణంగా స్టేషన్‌కు ముందుగానే చేరుకోవడం అవసరం. కనీసం 30 నుంచి 45 నిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరుకోవడం మంచిది. ట్రాఫిక్ జామ్‌లు లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యం అయితే రైలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రైలును మిస్ అయితే, మీ టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే విషయం రైల్వే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

కొత్త టిక్కెట్ తీసుకోవాల్సిందే

జనరల్ టికెట్‌ అయితే, కొన్ని సందర్భాల్లో అది పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా అదే రోజులో లేదా అందుబాటులో ఉన్న మొదటి రైలు వరకు మాత్రమే ఇది ఉపయోగించుకోవచ్చు. కానీ రిజర్వ్ చేసిన టికెట్‌ అయితే, మీరు ఆ రైలును మిస్ అయితే ఆ టికెట్‌ను వేరే రైలులో ఉపయోగించలేరు. అలాంటి సందర్భంలో కొత్త టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

చట్టపరమైన చర్యలు

ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి రైళ్లలో సాధారణ టికెట్లు చెల్లవు. ప్రతి రైలు కోసం ప్రత్యేక టికెట్‌ అవసరం. మీరు మిస్ అయిన రైలు టికెట్‌తో మరో రైలులో ప్రయాణిస్తే, నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు. అలాంటి సందర్భంలో టికెట్ చెకింగ్ సిబ్బంది జరిమానా విధించే అవకాశం ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అందువల్ల, రైలు మిస్ అయితే టికెట్‌ రకాన్ని బట్టి మాత్రమే తదుపరి ప్రయాణానికి అవకాశం ఉంటుంది.