mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 5:19 am Digital Edition : Namastey Mahaaprabha

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.

హైదరాబాద్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ యువకుడిపై విచాక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది గంజాయి బ్యాచ్. తీవ్రంగా గాయపడిన ఫహాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో ఫహాద్‌పై ఈ గ్యాంగ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. షానవాజ్, షాబాజ్‌తో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్‌లో యువకుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.