mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 11:46 am Digital Edition : MAHAA PRABHA DAILY

రెండు రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన దేశీయ సూచీలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్‌నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. రెండు రోజుల వరుస లాభాల అనంతరం.. నేడు భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, పెరిగిన చమురు ధరలతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం 74,883 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. ఆది నుంచీ భారీ నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,534 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 1690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.422 లక్షల కోట్లు పతనమైంది. ఫలితంగా ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది.

అటు.. నిఫ్టీ కూడా భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఆద్యంతం నష్టాల మధ్య కదలాడిన సూచీ.. మరోసారి 23వేల మార్క్‌కు పతనమైంది. చివరకు 486 పాయింట్లు క్షీణించి 22,819 వద్ద ముగిసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో భాగమైన శ్రీరామ్ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియాల్టీ షేర్లు సుమారు 3 శాతం మేర పతనమయ్యాయి.