మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భారతీయ జనతా యువ మోర్చా శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇండోర్ ఫిబ్రవరి 21 మహాప్రభ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) శనివారంనాడు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగడాన్ని తప్పుపడుతూ బీజేవైఎం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వకోవడంతో ఒక సబ్ ఇన్స్పెక్టర్, మీడియా వ్యక్తులతో సహా పలువురు గాయపడ్డారు. దీంతో పెద్దఎత్తున పోలీసు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ వద్దకు చేరుకోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రోడ్డును దిగ్బంధించి ఆందోళనకారులను అడ్డుకునేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
గ్వాలియర్లోనూ ఇరువర్గాల ఘర్షణ
కాగా, గ్వాలియర్లోనూ బీజేవైఎం, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీజేవైఎం కార్యకర్తలు గ్వాలియర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు హోరెత్తించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.