mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 12:02 pm Digital Edition : Namastey Mahaaprabha

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

కోల్‌కతా ఏప్రిల్ 21 (మహాప్రభ) : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ (Election commission) కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈనెల 23న మొదటి విడత పోలింగ్ జరిగే 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసీ విధించిన ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఈసీ ఆదేశాల ప్రకారం, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రోడ్లపై బైకులు, వాహనాలను అనుమతించరు. వైద్యం, కుటుంబ ఫంక్షన్ల వంటి ఎమర్జెనీ అవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, అడ్డంకులకు వీల్లేకుండా బైక్ ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించినట్టు ఈసీ తెలిపింది. అత్యవసర సందర్భాల్లో మినహా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పిలియన్ రైడింగ్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. పోలింగ్ రోజు పరిమితమైన సడలింపులను ఈసీ కల్పించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్, ఇతర అత్యవసర పనుల కోసం పిలియన్ రైడర్స్‌గా ట్రావెల్ చేసేందుకు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఎవరైనా వ్యక్తులు మినహాయింపులు కోరుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి పొందాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే గురువారం (23న) జరుగనుంది.