రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నంలోని పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
మచిలీపట్నం, ఫిబ్రవరి 25 మహాప్రభ : రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల సరఫరా కేంద్రాలు, డైరీలపై తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి ప్రాంతంలోని పాల కేంద్రాల్లోని పాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పరిశీలించారు.ఎస్.ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్స్కు పంపించారు. కొన్ని కేంద్రాల్లో ఎమ్మార్పీ (MRP), మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని, అత్యధిక కాలం ఫ్రిజ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం ఘటనలో కల్తీ పాలు తాగడం వల్ల పలువురు మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.