mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:58 am Digital Edition : Namastey Mahaaprabha

రష్యా ముడి చమురుపై యూఎస్ యూటర్న్

రష్యా చమురు కొనుగోళ్లపై ఇచ్చిన సడలింపులను మరో నెల రోజుల పాటు కొనసాగిస్తూ యూఎస్ ట్రెజరీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : రష్యా చమురుపై ఆంక్షల సడలింపులను కొనసాగించేది లేదన్న అమెరికా తాజాగా యూటర్న్ తీసుకుంది. మరో నెల రోజుల పాటు ఈ సడలింపులను కొనసాగిస్తున్నామని ప్రకటించింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లను ఇతర దేశాలు కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

రష్యా చమురు కొనుగోలుకు వీలుగా భారత్‌ కోసం అమెరికా మార్చి 5న ఆంక్షలను సడలించింది. అప్పటికే నౌకల్లోకి లోడ్ చేసిన రష్యా చమురు, రవాణాలో ఉన్న ముడి చమురు కొనుగోళ్లపై సడలింపులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఆ తరువాత సడలింపులను ఇతర దేశాలకూ విస్తరించింది. చివరకు ఏప్రిల్ 11 వరకూ వాటిని పొడిగించింది. మరో నెల రోజుల పాటు సడలింపులు అమల్లోనే ఉంటాయని తాజాగా మరోసారి ప్రకటించింది. అయితే, ఇరాన్, ఉత్తరకొరియా, క్యూబా, ఉక్రెయిన్‌లోగల కొన్ని ప్రాంతాల్లోని సంస్థలు, వ్యక్తులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవని పేర్కొంది.

రష్యా, ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఇచ్చిన సడలింపులను కొనసాగించేది లేదని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ బుధవారం తేల్చిచెప్పారు. ఇంతలోనే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇక శుద్ధి చేసిన యూరేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. తాము అలా చెప్పలేదని ఇరాన్ భగ్గుమంది. అబద్ధాలతో చర్చల్లో విజయం సాధించలేరని తాజాగా స్పష్టం చేసింది.