mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 11:58 am Digital Edition : Namastey Mahaaprabha

యూపీఐ చెల్లింపులు.. గంట తరువాతే నగదు బదిలీ! ఆర్‌బీఐ ప్రతిపాదన

ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్‌బీఐ మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో గోల్డెన్ అవర్ ఫీచర్‌ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : క్షణాల్లో నగదు బదిలీకి అవకాశం కల్పించే యూపీఐ వ్యవస్థ ఎంతో ఆదరణ పొందుతోంది. అయితే, ఈ తక్షణ నగదు ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా వాడుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గోల్డెన్ అవర్‌ను ప్రతిపాదించింది. కొన్ని రకాల యూపీఐ చెల్లింపుల్లో నగదు బదిలీని గంట తరువాత పూర్తి చేయాలని సూచించింది. ఈ గంట సమయంలో బాధితులు నష్టనివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు అభిప్రాయాలను తెలపాలని కూడా ఆర్బీఐ కోరింది.

ఏమిటీ చిక్కులు

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఆథొరైజ్డ్ పుష్ పేమెంట్స్ మోసాలకు దిగుతున్నారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ బాధితులను కంగారు పెట్టి క్షణాల్లో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు. ఎలాంటి హ్యాకింగ్‌కు పాల్పడకుండానే ప్రజల అవగాహన లోపాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఫలితంగా మోసాన్ని గ్రహించేలోపే బాధితుల అకౌంట్స్ ఖాళీ అయిపోతున్నాయి.

ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గోల్డెన్ అవర్ ఉపయోగపడుతుందని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. గంట తరువాత నగదు బదిలీ జరిగే ఫీచర్ అందుబాటులో ఉంటే బాధితులు నష్టనివారణ చర్యలు తీసుకునే అవకాశం దక్కుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, గోల్డెన్ అవర్‌ను కేవలం పెద్ద మొత్తాల బదిలీలకే వర్తించాలని కూడా ఆర్‌బీఐ పేర్కొంది. రూ.10 వేల పైబడిన ట్రాన్సాక్షన్స్‌కు గోల్డెన్ అవర్‌ను వర్తింపచేయాలని అభిప్రాయపడింది. రూ.10 వేల లోపు విలువైన ట్రాన్సాక్షన్స్‌ విషయంలో మాత్రం చెల్లింపులు ఎప్పటిలాగే తక్షణం జరుగుతాయి. దీంతో, రోజువారి చెల్లింపుల్లో వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.