mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:43 am Digital Edition : Namastey Mahaaprabha

మోటార్లు, వైర్లు దొంగతనం.. చాకచక్యంగా పట్టుకున్న రైతులు

పొలాల్లో మోటార్లు, వైర్లను దొంగలించేందుకు వచ్చిన దొంగలను రైతులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గతంలో వరుసగా దొంగతనాలు జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు.

జయశంకర్ భూపాలపల్లి మే 1 ( మహాప్రభ ) : భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో మోటార్లు, కరెంటు వైర్లు దొంగిలించేందుకు వచ్చిన దొంగలను స్థానిక రైతులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో గతంలో వరుసగా దొంగతనాలు జరగడంతో రైతులు అప్రమత్తమయ్యారు. తమ పొలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత రాత్రి దొంగలు పొలాల్లోకి వచ్చి మోటార్లు, వైర్లు దొంగిలిస్తుండగా సీసీ కెమెరాలు యాక్టివ్ అయి రైతుల ఫోన్లకు సైరన్ మెసేజ్‌లు వెళ్లాయి.

మెసేజ్‌లు అందుకున్న వెంటనే గ్రామస్థులు.. దొంగలను వెంబడించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన దొంగలు హనుమకొండ జిల్లా పరకాల మండలం వరికోలు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. రైతులు.. దొంగలను పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.