దుర్గగుడి పాలకమండలి సమావేశంలో ప్రధానంగా 37 అంశాలపై చర్చ జరిగింది. ఆలయంతో పాటు క్యూలైన్లలోనూ భక్తుల కోసం టీవీలు పెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.
విజయవాడ ఏప్రిల్ 13 (మహాప్రభ) : దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 37 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఆలయంతో పాటు క్యూలైన్లలోనూ భక్తుల కోసం టీవీలు పెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. టీవీలు ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యరీత్యా ఓ హాస్పిటల్తో ఎంవోయూ చేసుకోబోతున్నామని చెప్పారు.
కనకదుర్గానగర్లో మరుగుదొడ్లు గంజాయి బ్యాచ్ వాడుతున్నారని తెలిసిందని.. ఇకపై అలా జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. అమ్మవారికి 234 ఎకరాలు ఉన్నాయని… కొన్ని చోట్ల కౌలు జరగడం లేదని.. మరికొన్ని చోట్ల అన్యాక్రాంతమైనట్లు గుర్తించామన్నారు. వాటిపైన ఏం చేయాలనే అంశంపై చర్చించామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు.