మంగళవారం మధ్యాహ్నం మీరట్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరట్ బ్లూ డ్రమ్ కేసు విచారణ జరిగింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడు సోహెల్తో కలిసి హత్య చేసిన ముస్కాన్ రాజ్పుత్ 6 నెలల కూతురు రాధతో కోర్టుకు వచ్చింది.
లక్నో ఏప్రిల్ 22 (మహాప్రభ) : మీరట్ బ్లూ డ్రమ్ కేసుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం మీరట్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడు సోహెల్తో కలిసి హత్య చేసిన ముస్కాన్ రాజ్పుత్ 6 నెలల కూతురు రాధతో కోర్టుకు వచ్చింది. సౌరభ్ కుటుంబసభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం సౌరభ్ తల్లి రేణు దేవి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకును మర్డర్ చేయటంలో ముస్కాన్ తల్లిదండ్రులు, తోబుట్టువుల హస్తం కూడా ఉందని రేణు దేవి ఆరోపించారు.
ఆమె మాట్లాడుతూ.. ‘నా కొడుకును మర్డర్ చేయటంలో ముస్కాన్ తల్లిదండ్రులు, తోబుట్టువుల హస్తం కూడా ఉంది. కానీ, వాళ్లు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. పోలీసులు నా ఆరోపణలను కొట్టిపారేశారు. ముస్కాన్ తండ్రే స్వయంగా ముస్కాన్ను పోలీసులకు అప్పగించాడని చెబుతున్నారు. నా కొడుకు ప్రతీ నెల ఖర్చుల కోసం ముస్కాన్కు 50 వేల రూపాయలు ఇచ్చే వాడు. కానీ, వాళ్లు మాత్రం నా కొడుకును చంపేశారు. హంతకులను కచ్చితంగా ఉరి తీయాల్సిందే’ అని రేణు దేవి డిమాండ్ చేశారు.
పాపం చిన్నారి..
గత ఏడాది నవంబర్ నెలలో ముస్కాన్ జైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. సౌరభ్ పుట్టిన రోజు నాడే రాధ జన్మించింది. ఆ బిడ్డను తమ వారసురాలిగా సౌరభ్ రాజ్పుత్ తల్లిదండ్రులు అంగీకరించటం లేదు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియడానికి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని సౌరభ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల్లో ఫలితాలను బట్టి బిడ్డను అంగీకరిస్తామని అంటున్నారు.