mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 11:40 am Digital Edition : Namastey Mahaaprabha

మరో మూడు గంటల్లో ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ దంచికొట్టింది. తర్వాతి నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది.

హైదరాబాద్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండ దంచికొట్టింది. తర్వాతి నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో మరో మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

రేపు ఈ జిల్లాల్లో వర్షం..

ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లు..

అకాల వర్షాల కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు. అమ్మకానికి ఉంచిన ధాన్యం నీటి పాలవుతోంది. నిన్న నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా మార్కెట్ యార్డ్‌ల దగ్గర అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మంగళవారం రాత్రి జోగుళాంబ గద్వాలలో వర్షం కురిసింది. మార్కెట్ యార్డ్‌ల దగ్గర ఆరబెట్టిన మొక్కజొన్న రాశుల్లోకి నీరు చేరింది. ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా మార్కెట్ యార్డ్‌ల దగ్గర ఉంచిన ధాన్యం తడిసిపోయింది.