కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన హృదయవిదారక ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను అతి దారుణంగా భర్త హత్య చేశాడు. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప (ప్రొద్దుటూరు) మే 5 ( మహాప్రభ ) : పెళ్లైన నాటి నుంచి కలిసి మెలిసి ఉండాల్సిన భర్తే కాలయముడయ్యాడు. భార్యను చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి, పథకం ప్రకారం హత్య చేసిన సంఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్య జరిగిన తీరు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 29వ తేదీన నిందితుడైన కిరణ్, తన భార్య పద్మను నిద్రిస్తున్న సమయంలో దిండుతో ముఖంపై అదిమి పట్టుకున్నాడు. ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. కిరణ్ గత కొంతకాలంగా ఇంటర్నెట్లో ‘భార్యను ఎలా చంపాలి?’, ‘ఎలాంటి ఆధారాలు దొరకకుండా హత్య చేయడం ఎలా?’ అని గూగుల్లో సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఆన్లైన్లో విషం కొనుగోలు..
కేవలం దిండుతో చంపడమే కాకుండా, భార్యకు విషం ఇచ్చి చంపడానికి కూడా నిందితుడు ప్రయత్నించాడు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా ఏకంగా రూ. 80,000 ఖర్చు చేసి విషాన్ని ఆర్డర్ చేయడం గమనార్హం.
పోలీసుల దర్యాప్తు..
పద్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. అతని సెల్ఫోన్, ఇంటర్నెట్ హిస్టరీని పరిశీలించగా, హత్యకు సంబంధించిన కుట్ర అంతా బట్టబయలైంది. నేరస్థులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు వారిని పట్టుకోగలరని ఈ కేసు మరోసారి నిరూపించింది. కేవలం గూగుల్ సెర్చ్ చేసిన ఆధారాలతోనే నిందితుడి పక్కా ప్లాన్ను పోలీసులు బహిర్గతం చేశారు. పద్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.