mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 9:53 am Digital Edition : Namastey Mahaaprabha

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ : Mahaaprabha

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భాగంగా భారత వ్యవసాయ రంగానికి పూర్తి రక్షణ లభించిందని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన కీలక వివరాలను తాజా పత్రికా సమావేశంలో వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 7  మహాప్రభ : అమెరికాతో తాజాగా కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (Ind US Interim Trade Deal) కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తాజాగా స్పందించారు. ఈ ట్రేడ్‌ డీల్‌లో భారత రైతులకు పూర్తి రక్షణలు (Agriculture Sector Protected) లభించాయని కూడా స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై సుంకాలు తక్కువని తెలిపారు (Reduced Tariffs). ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి కార్యాచరణ ప్రకారం, భారత్‌పై ప్రతీకార సుంకం 18 శాతానికి తగ్గిందని చెప్పారు. అదనంగా విధించిన 25 శాతం సుంకాన్ని కూడా అమెరికా ఉపసంహరించుకుందని చెప్పారు.‘మన ఉత్పత్తులపై సుంకం 18 శాతం. ఇది పొరుగు దేశాలతో పోలిస్తే మెరుగు’ అని తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి తెలిపారు. చైనా వస్తువులపై 35 శాతం, వియత్నాం, బంగ్లాదేశ్ వస్తువులపై 20 శాతం, ఇండోనేషియా వస్తువులపై 19 శాతం చొప్పున అమెరికా సుంకాలు విధిస్తోందని అన్నారు. భారత ఎగుమతిదారులు అనేక వస్తువులను ఎలాంటి సుంకాల బెడద లేకుండా అమెరికాకు ఎగుమతి చేయొచ్చని చెప్పారు.పలు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ఎలాంటి సుంకాలు ఉండని చెప్పారు. మసాలాదినుసులు, టీ, కాఫీ, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు రకాల పండ్లు, కూరగాయాలను సుంకాల బెడద లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి వివరించారు.భారత వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించామని కూడా మంత్రి వివరించారు. విదేశీ ఉత్పత్తులకు భారత వ్యవసాయ రంగం తలుపులను పూర్తిగా తెరవలేదని భరోసా ఇచ్చారు. భారత దేశం స్వయం సమృద్ధి సాధించిన వ్యవసాయ ఉత్పత్తులను ట్రేడ్ డీల్ పరిధిలోకి తేలేదని వివరించారు.మాంసం, పౌల్ట్రీ, డెయిరీ, సోయాబీన్, మొక్కజొన్న, వరి, గోధుమలు, చక్కెర, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు వంటివి అమెరికా నుంచి తక్కువ టారిఫ్‌లకు భారత్‌లోకి అనుమతించబోమని చెప్పారు. గ్రీన్ టీ, కాబూలీ శనగలు, పల్లీలు, మాల్ట్, మాల్ట్ ఆధారిత ఉత్పత్తులకు కూడా ఈ ట్రేడ్ డీల్‌లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని వివరించారు.‘భారత రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే కొందరు ఈ ట్రేడ్ డీల్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు’ అని వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ కామెంట్ చేశారు.