mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 12:30 pm Digital Edition : Namastey Mahaaprabha

బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్.. నలుగురు అనుమానితుల అరెస్టు

సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇతరులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ ఏప్రిల్ 18 (మహాప్రభ) : సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపేందుకు రెక్కీలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇతరులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిఘా ఆధారిత ఆపరేషన్ ద్వారా ఇద్దరు నిందితులు మోసైబ్ అహ్మద్, హహమ్మద్ హమాద్‌లను మహారాష్ట్రలో, షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఒడిశాలో, మహమ్మద్ సోహైల్‌ను బిహార్‌లో అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరిని ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారు తయారీకి యత్నిస్తుండగా పట్టుకున్నారు.

నలుగురు నిందితులు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. నిందితులలో ఒకడు ఎర్రకోట తమలక్ష్యమని తెలిపే సంకేతంతో నల్లజెండాతో కూడిన ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసినట్టు గుర్తించామని చెప్పారు. షేక్ ఇమ్రాన్ అనే నిందితుడు 2025లో ఎర్రకోట, ఇండియా గేట్ సహా కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిపారు. మోసైబ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఆటో ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడని, ఐఈడీ అమర్చిన రిమోట్ కంట్రోల్ కారు డిజైన్‌కు అవసరమైన సాంకేతిక నైపుణ్యం అతనికి ఉందని గుర్తించామని వివరించారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి నిందితుల నెట్‌వర్క్ ఛేదించేందుకు, ఇతర ముఠాలతో సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.