విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా, డ్రైవర్ అప్రమత్తతతో 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
విజయవాడ మార్చి 31 (మహాప్రభ): బస్ స్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించగా పెద్ద ప్రమాదం తప్పింది.
స్థానికుల సమాచారం ప్రకారం, రావులపాలెం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటకు దింపాడు. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. బస్సులలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.