mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 11:45 am Digital Edition : Namastey Mahaaprabha

ప్రేమ వివాహం.. నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

అదనపు కట్నం వేధింపులు తాళలేక పెళ్లైన నెలరోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్ బన్సల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఫిబ్రవరి 20, 2026న పెద్దల సమక్షంలో ఇరువురూ వివాహం చేసుకున్నారు.

మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేట్‌లోనీ ఓ అపార్ట్‌మెంట్‌లో ఇషిక, నీరజ్ నివాసముంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ భార్యాభర్తలు ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా అదనపు కట్నం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇషిక ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇచ్చిన సమాచారంతో మియాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.