టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆడిన తీరును ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 23 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజిలో అజేయంగా నిలిచిన టీమిండియా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్ సెమీస్ ఆశలు కాస్త సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆడిన తీరును ప్రస్తావించాడు.‘ఐపీఎల్లో జట్లలో మార్పులు చేర్పులు చేయొచ్చు. 14 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది కాబట్టి తప్పదు. కానీ ఐసీసీ టోర్నమెంట్లలో జట్టును ఎంత స్థిరంగా కొనసాగిస్తే అంత మంచిది. ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కొనేందుకు వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని నేను వందశాతం సమర్థిస్తాను. కానీ అక్షర్ పటేల్ టీ20 ఫార్మాట్లో అత్యంత కీలకమైన ఆటగాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పుడు క్రీజులోకి వచ్చిన అక్షర్.. విరాట్ కోహ్లీతో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో టీమిండియా 170 పరుగుల మార్క్ను దాటింది.రింకు సింగ్ను నం.8లో ఆడించడం ఏంటి? జట్టులో 8 మంది బ్యాటర్లు ఉన్నారు. అలాంటప్పుడు అతడిని అంత దిగువన ఆడించకుండా ఉండాల్సింది. వాషింగ్టన్ సుందర్ను అగౌరవ పరచడం లేదు. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలు మనందరికీ తెలుసు. సౌతాఫ్రికాతో ఓటమి టీమిండియాకు ఓ గుణపాఠం. సరైన సన్నద్ధత లేకుండా మ్యాచ్లు ఆడేందుకు రావొద్దు’ అని అశ్విన్ వెల్లడించాడు.