mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:39 am Digital Edition : MAHAA PRABHA DAILY

పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని సూచించింది. సాధారణ కంటెయినర్లలో పెట్రోల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి14 మహాప్రభ : కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని భరోసా ఇచ్చింది. కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని ప్రజలకు సూచించింది. సాధారణ కంటెయినర్‌లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.

తమిళనాడులో ఒక పెట్రోల్ బంక్ నుంచి సాధారణ కంటెయినర్‌లో పెట్రోల్ తరలించిన వైనం తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సూచన చేస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి చర్యలతో భద్రతాపరమైన ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. ఇలా పెట్రోల్‌ను విక్రయించిన రిటైల్ ఔట్‌లెట్‌పై తగిన చర్యలు తీసుకున్నామని కూడా పెట్రోలియం శాఖ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ విక్రయాలకు సంబంధించి పెట్రోల్ పంప్‌లు, డీలర్లకు భద్రతాపరమైన మార్గదర్శకాలు జారీ చేశామని కూడా కేంద్రం పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇక గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌ల విషయంలో నెలకొన్న భయాందోళనలపై ఇటీవల మార్కెటింగ్ ఆయిల్ రిఫైనరీ విభాగం జాయింట్ సెక్రెటరీ కూడా స్పందించారు. ఎల్‌పీజీ డెలివరీల్లో ఎలాంటి ఆటంకాలు లేవని అన్నారు. గ్యాస్ ఉత్పత్తిని భారతీయ రిఫైనరీలు 30 శాతం మేర పెంచాయని అన్నారు. గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు తెలిపారు.ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేసింది. కీలక రంగాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా జరిగేలా మార్గదర్శకాల రూపకల్పన, అమలు బాధ్యతలను రాష్ట్రాలకు బదిలీ చేసింది.