mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:55 am Digital Edition : Namastey Mahaaprabha

పూజ చేస్తుండగా ప్రమాదం.. మహిళ మృతి

రోజువారీ పూజ చేస్తూ చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ(62) మృతి చెందారు. పూజా సమయంలో దీపం వెలిగిస్తుండగా విజయలక్ష్మీ చీరకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.

హైదరాబాద్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రోజువారీ పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ(62) మృతి చెందారు. పూజా సమయంలో దీపం వెలిగిస్తుండగా విజయలక్ష్మీ చీరకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆమె భయంతో అటు ఇటు పరుగెత్తగా మంటలు మరింత వ్యాపించాయి. సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నిచర్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపడిపోయింది.

ఇంటి నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందించారు. అప్పటికే విజయలక్ష్మీ మృతి చెందినట్లు తెలిసింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయలక్ష్మీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ఆమె బేగంపేట్ ష్యామ్‌లాల్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.