mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 11:35 am Digital Edition : Namastey Mahaaprabha

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన ఏనుగు..

ఓ ఏనుగు పోలింగ్ కేంద్రం దగ్గర హల్‌చల్ చేసింది. ఓటు వేయడానికి వచ్చిన జనాలను భయపెట్టింది. అయితే, ఎవ్వరికీ ఏ హాని చేయకుండా ఆ ఏనుగు అక్కడినుంచి వెళ్లిపోయింది.

కోల్‌కతా ఏప్రిల్ 23 (మహాప్రభ) : మొదటి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ఏనుగు పోలింగ్ కేంద్రం దగ్గర హల్‌చల్ చేసింది. ఓటు వేయడానికి వచ్చిన జనాలను భయపెట్టింది. అయితే, ఎవ్వరికీ ఏ హాని చేయకుండా ఆ ఏనుగు అక్కడినుంచి వెళ్లిపోయింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఝార్‌గ్రామ్‌లోని ‘జీతూసోల్ ప్రైమరీ స్కూల్‌’లో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

స్థానికులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళుతున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఓ ఏనుగు సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ఏనుగు ఎంట్రీతో పోలింగ్ కేంద్రం దగ్గర ఒక్కసారిగా కలకలం చెలరేగింది. జనం భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఆ ఏనుగు పోలింగ్ కేంద్రం ముందు నిలిపి ఉన్న వాహనం దగ్గర ఆగింది. ఆ వాహనంలో తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని తొండంతో చెక్ చేసింది. ఏమీ దొరక్కపోవటంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నాటు బాంబు కలకలం..

మరో ఘటనలో.. ముర్షిదాబాద్‌ జిల్లాలోని నవోదా ప్రాంతంలో నాటు బాంబు కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ వ్యక్తి పోలింగ్ బూత్ సమీపంలో నాటు బాంబు విసరడంతో పలువురు గాయపడ్డారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఇతర ఓటర్లు అక్కడినుంచి పరుగులు తీశారు. పోలీసులు గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నాటు బాంబు దాడి సమాచారం అందగానే భద్రతా దళాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. బాంబు విసిరింది ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి.