కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. దాడి చేసిన వారు మినహా రాష్ట్ర ప్రజలు దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లా, మార్చి 4 మహాప్రభ : కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) పేర్కొన్నారు. దాడి చేసిన వారు మినహా రాష్ట్ర ప్రజలు దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనకు సత్తెనపల్లిలో 22 ఎకరాల పొలం ఉందని.. ఆ పొలాన్ని సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని ప్రస్తావించారు. ఇవాళ(బుధవారం) గుంటూరు వేదికగా మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు.తన పొలాన్ని సర్వే చేయాలని ఎమ్మార్వో కార్యాలయం నుంచి నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ తనిఖీ చేయమని చెప్పారని వారు తనకు చెప్పారన్నారు. తన పొలంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఉందని సర్వే చేయాలని చెబుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లకు పని ఏమి లేదా అని ప్రశ్నించారు..
నా ఆస్తుల మీద పడ్డారు..
‘నా ఆస్తుల మీద పడ్డారు. నేను లీగల్గా కొనుకున్న స్థలం అది. నేను వేరే వారి నుంచి పొలం కొనుక్కునే ముందే అందులో చిన్న బావి ఉంది, పెంకుటిల్లు ఉంది. చంద్రబాబు కృష్ణానది తీరాన అక్రమంగా ఇళ్లు కట్టారు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదు. నా దగ్గర దాపరికాలు ఏమి ఉండవు. చంద్రబాబు, లోకేశ్ నా పొలం చూస్తాను అంటే రండి. కృష్ణానది గర్భంలో ఇల్లు కట్టించి చంద్రబాబు. నన్ను బయపెట్టాలి అనుకుంటున్నారు. రేపు గుంటూరులో మా ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమో’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.