mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 5:58 am Digital Edition : Namastey Mahaaprabha

‘నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు’: సీఎం చంద్రబాబు

‘మా రాజధాని అనే చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపినందుకు, నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’: సీఎం చంద్రబాబు

అమరావతి ఏప్రిల్ 7 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026’కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ కీలక పరిణామంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయం అని కొనియాడారు.

ఈ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘మా రాష్ట్రం పట్ల నిబద్ధతను చాటుతూ, తగిన మార్గదర్శకత్వం వహించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మాతో నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.