mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:58 am Digital Edition : MAHAA PRABHA DAILY

నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలి

భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు.

  • సీఎం రాక నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి
  • వీసీలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌
  • భద్రాద్రిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ అంకిత్‌

భద్రాచలం మార్చి 24 మహాప్రభ : భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్‌ హనుమంతరావుతో కలిసి సోమవారం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వంహించారు. ఈ వీసీకి భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ అంకిత్‌, సబ్‌కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట హాజరయ్యారు.

ఈ సందర్భంగా శైలజారామయ్యర్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి తగిన కార్యాచరణతో పని చేయాలన్నారు. ఇక నవమి రోజున 27న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాద్రి రానున్నారని, అదేరోజు ఆయన చేతుల మీదుగా ఆలయాభివృద్ది పనులకు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు శిలాఫలం ఏర్పాటు పనులు పూర్తి చేయాలన్నారు. ఇక పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ , తదిత భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. మిథిలా స్టేడియంలో ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు, వీఐపీలతో పాటు రామయ్య దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

నవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

 

భద్రాచలంలో మిథిలా స్టేడియంలో జరుగుతున్న శ్రీరామనవమి ఏర్పాట్లను కలెక్టర్‌ అంకిత్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో విధులు నిర్వహించే సెక్టార్‌ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. 26న ఉదయం 9గంటల వరకు సబ్‌కలెక్టరు కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సక్రమంగా విధులు నిర్వహించాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.వీవీఐపీ, వీఐపీలకు బస చేసే అతిథి గృహాలకు నియమితులైన సెక్టారల్‌ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న పిల్లలు, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్న వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీఐపీల వెంట వచ్చే సిబ్బంది ఎవరైనా గొడవలకు దిగితే పోలీసు సహకారం తీసుకొని సర్దుబాటు చేయాలని, దేవుడి దగ్గర అందరూ సమానమే అన్నారు. ఈ కార్యక్రమాల్లో జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఐటీడీఏ పీవో బి.రాహుల్‌, ఎస్పీ రోహిత్‌రాజు, సబ్‌కలెక్టర్‌ మృణాల్‌శ్రేష్ట, శిక్షణ కలెక్టర్‌ సౌరభ్‌ శర్మ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌, డీఆర్‌డీవో విద్యాచందన, తదితరులు పాల్గొన్నారు.