mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 11:48 am Digital Edition : Namastey Mahaaprabha

దొంగలొస్తారు జాగ్రత్త!

వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్‌ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.

  • అప్రమత్తతే ఇంట్లో సొమ్ముకు భద్రత 
  • ఆభరణాలు ధరించి, ఆరుబయట నిద్రించవద్దు
  • ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలి  

ధర్మవరం(అనంతపురం) మే 2 ( మహాప్రభ ) : వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్‌ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు. ఇలా వెళ్లడమే దొంగలకు అవకాశంగా మారుతోంది. అలాగే రాత్రిళ్లు ప్రజలు ఆరు బయట, మిద్దెలపై నిద్రిస్తున్న సమయంలోనూ దొంగలు తమ చేతికి పదును పెడుతున్నారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో వేసవిలోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

  • వేసవిలో మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ధరించి, ఇంటి బయటకానీ, మిద్దెపై కానీ నిద్రించరాదు.
  • ఇంట్లో పడుకున్నప్పుడు లోపల డోర్‌లాక్‌ చేయడం మరచిపోరాదు.
  • ఇంట్లో వారంతా ఊరు వెళ్లవలసివస్తే, విలువైన బంగారం, వెండి అభరణాలు, నగదును బ్యాంకు లాకరులో భద్రపరచాలి. లేదంటే వెంట తీసుకెళ్లాలి.
  • బయట ఊర్లకు వెళ్లేటప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎ్‌స)ను ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా పర్యవేక్షిస్తారు.
  • అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి.ఎల్‌హెచ్‌ఎంఎస్‏ను ఎలా వాడాలంటే..?

    ముందుగా ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌లోకి వెళ్లి రిక్వెస్టు పోలీసు వాచ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏ తేదీన ఏ సమయానికి ఊరు వెళ్తున్నారు. ఎప్పుడు తిరిగి వస్తారు…అన్నవివరాలను యాప్‌లో పొందుపరచాలి. వెంటనే ఆ సమాచారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. అక్కడ సిబ్బంది ఆ ఇంటికి వైపైతో పని చేసే నిఘా కెమెరాలను అమర్చుతారు. ఆ ఇంట్లో ఎలాంటి కదలికలున్నా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సైరన్‌ మోగుతుంది. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్‌, రక్షక్‌, బ్లూక్లోట్స్‌ వాహనాలకు సమాచారం వెళ్తుంది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దొంగలను పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.

 

ప్రజలకు అవగాహన కల్పిస్తాం

వేసవిలో జరిగే చోరీలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఎస్పీ ఆదేశాలమేరకు ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌ ప్రజలకు తెలియజేస్తాం. వేసవి సెలవుల్లో సొంతూర్లకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌ సేవలను వినియోగించుకోవాలి.

  • రెడ్డప్ప, సీఐ, టూటౌన్‌, ధర్మవరం