mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 12:18 pm Digital Edition : Namastey Mahaaprabha

దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. స్కైమెట్ వెల్లడి

భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్-సెప్టెంబర్‌లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది.

న్యూఢిల్లీ ఏప్రిల్ 7 (మహాప్రభ) : భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్-సెప్టెంబర్‌లో ఎల్ నినో (EL Nino) ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ (Skymet) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కాలంలో దీర్ఘకాలిక వర్షపాతం సగటున 868.6 మిల్లీమీటర్లు కాగా, అందులో 94 శాతం వర్షాలు మాత్రమే పడే అవకాశాలున్నాయని తెలిపింది. 2026 వర్షాకాలం సీజన్‌లో నమోదయ్యే వర్షపాతం అంచనాలను భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే వారంలో విడుదల చేయనుంది.

భారత్‌లో ఏడాదిలో నమోదయ్యే వర్షపాతంలో దాదాపు 70 శాతం వరకూ నైరుతి రుతుపవనాల వల్లే సాధ్యమవుతుంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వరి, పత్తి, చెరుకు సహా ఖరీఫ్ పంటల సాగుకు కీలకమవుతాయి. సాధారణంగా జూన్ 1 లేదా మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకి, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశమంతటా విస్తరిస్తాయి. కాగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వచ్చే ఈశాన్య రుతుపవనాలు స్వల్పకాలికమే అయినా అగ్నేయ భారతదేశానికి, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఈ వర్షాలు కీలకం. శీతాకాలంలో మధ్యధరా ప్రాంతం నుంచి వచ్చే అల్పపీడన వ్యవస్థల కారణంగా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురియడానికి కారణమవుతుంటాయి. అయితే ఈ వర్షాలు ఉత్తరభారతదేశంలో కీలకమైన రబీ పంటలు, ముఖ్యంగా గోధుమలకు చాలా ఉపయోగకరం.