mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:56 am Digital Edition : MAHAA PRABHA DAILY

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన..

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్‌కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్ మార్చి 25 మహాప్రభ : అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్‌కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. క్యూ కట్టి మరీ బంకుల నుంచి పెద్దఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఆందోళన వద్దు..

హైదరాబాద్‌లోనూ అవసరం లేకున్నా లీటర్ల కొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు. దీంతో పలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. నగర వ్యాప్తంగా చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే, దీనిపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.

తెలంగాణలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించింది. పీఆర్ఎస్‌వో(PRSO)లకి విరుద్ధంగా ప్రజలు, బంకుల యాజమాన్యాలు ప్రవర్తించవద్దని చెప్పింది. అవసరాన్ని బట్టి మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సప్లయ్ చైన్స్ సరిగ్గా పని చేస్తున్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది

బీపీసీఎల్ అడ్వైజరీ జారీ..

మరోవైపు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL) అడ్వైజరీ జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. భారతదేశంలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా సరఫరా నడుస్తోందని.. బీపీసీఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని అడ్వైజరీలో తెలిపింది.