mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 7:36 am Digital Edition : Namastey Mahaaprabha

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్న విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు.

నిజామాబాద్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్న విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలుసని అన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. కేటీఆర్ రెండు విషయాలు స్పష్టంగా ఒప్పుకున్నారని.. దోపిడీ దౌర్జన్యం చేశామని అంగీకరించారని మహేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చని.. స్వాగతిస్తామని తెలిపారు. అయితే పాదయాత్రలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.

గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. సింగరేణిలో విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్‌ఎస్ అవినీతి చెరిపేస్తే చెదిరేది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చినా తమకు ఇబ్బంది లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని ధీమా వ్యక్తం చేశారు. కవితకు తమకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా స్వాగతిస్తామన్నారు. వారి కుటుంబ వాటాల పంచాయితీని తమపై అంటగట్టవద్దని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.