mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:15 pm Digital Edition : Namastey Mahaaprabha

ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లిన వాహనం.. డ్రైవర్ అరెస్టు

ఢిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఢిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన సంచలనం సృష్టించగా, ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, గేట్ నెంబర్ 2 వద్దనున్న ఇనుప బ్యారియన్‌ను ఛేదించుకుంటూ ఒక వాహనం అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టింది. వాహనం డ్రైవరు స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు దూసుకుపోయాడు. కార్యాలయం ముందు ఫ్లవర్ బోకే ఉంచడంతో పాటు స్పీకర్‌ కారుపై ఇంకు చల్లినట్టు గుర్తించారు. ఘటన అనంతరం వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. హైసెక్యూరిటీ జోన్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతా ఆందోళనలను మరింత పెంచినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఉంచిన పుష్పగుచ్ఛంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌ను స్కానింగ్ చేసి వాహనం డ్రైవరు ఈ ఘటనకు పాల్పడడానికి కారణంపై విచారణ జరుపుతున్నారు. ఇటీవల ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజా ఘటనతో హైసెక్యూరిటీ జోన్‌లో భద్రతా ఉల్లంఘనలు మరింత అందోళనలను కలిగిస్తున్నాయి.