mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 6:03 am Digital Edition : Namastey Mahaaprabha

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

హైదరాబాద్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. డీలిమిటేషన్‌పై హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదనకు జాతీయ స్థాయిలో బలం కూడగట్టేందుకు ఆయన చర్యలు చేపట్టారు. అలాగే ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం రేవంత్ సమన్వయం చేస్తున్న విషయం విదితమే. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులందరికి ఆయన లేఖలు రాశారు.

హైబ్రిడ్ మోడల్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. మరో వైపు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

సీఎంతో భేటీ కానున్న టీపీసీసీ..

సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం 11.00 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఆ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. పార్టీలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులతోపాటు నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్‌తో వారు చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులపై వస్తున్న ఆరోపణలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. డీలిమిటేషన్‌ గురించి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో వీరు చర్చిస్తారనే ప్రచారం సాగుతుంది.