mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 12:23 pm Digital Edition : Namastey Mahaaprabha

డబ్బుకోసం పిన్నిని హత్య చేసిన మహిళ.. సంవత్సరం తర్వాత..

ఓ మహిళ డబ్బు కోసం సొంత పిన్నిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసింది. మర్డర్ జరిగిన సంవత్సరం తర్వాత నిందితులకు ఊహించని షాక్ తగిలింది.

బెంగళూరు ఏప్రిల్ 18 (మహాప్రభ) : ఓ మహిళ డబ్బు కోసం సొంత పిన్నిని ప్రియుడితో కలిసి హత్య చేసింది. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసింది. మర్డర్ జరిగిన సంవత్సరం తర్వాత నిందితులకు ఊహించని షాక్ తగిలింది. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిక్కబళ్లాపూర్‌కు చెందిన 52 ఏళ్ల నునకమ్మకు భర్త, పిల్లలు లేరు. గత కొన్నేళ్ల నుంచి అన్న దగ్గర ఉంటోంది. నునకమ్మ సొంత అక్క కూతురు 32 ఏళ్ల నాగలక్ష్మికి ఓ దారుణమైన ఆలోచన వచ్చింది.

ఎవ్వరూ లేని నునకమ్మను చంపి, ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం దోచేయాలని భావించింది. ఇందుకోసం ప్రియుడు అశోక్‌ కుమార్‌తో కలిసి మర్డర్ ప్లాన్ వేసింది. 2025 సెప్టెంబర్ 20వ తేదీన ఆస్పత్రికి తీసుకెళతామని నమ్మించి నునకమ్మను బైకు మీద అడవిలోకి తీసుకెళ్లారు. అడవిలో ఆమెను హత్య చేశారు. తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లోని కప్‌బోర్డులో ఉన్న డబ్బు, నగలు దొంగిలించారు. నాలుగు రోజుల తర్వాత అడవిలోకి మళ్లీ వెళ్లారు. కుళ్లిన స్థితిలోని నునకమ్మ శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 2025, అక్టోబర్ 19వ తేదీన అడవిలో అటువైపు వెళుతున్న వారు మనిషి పుర్రె, ఎముకలను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నునకమ్మ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎముకలు దొరికిన చోట చీర, ముక్కు రాయి దొరకటంతో.. చనిపోయింది మహిళ అని గుర్తించారు. కానీ, ఆమె ఎవరన్నది కనుక్కోవటం సమస్యగా మారింది. దాదాపు 6 నెలల తర్వాత టెక్నాలజీ సహాయంతో చనిపోయిన మహిళ నునకమ్మ అని తేల్చారు. ఆమె చావుకు నాగలక్ష్మి కారణం అని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. తాజాగా, నాగలక్ష్మితో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.