ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 మహాప్రభ : ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో(Chutneys Hotel) శుక్రవారం పేలుడు సంభవించింది. హోటల్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దఎత్తున పేలుడు శబ్దం రావడంతో హోటల్కు వచ్చిన కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో హోటల్లో పనిచేస్తున్న వారిలో ఒకరి తలకు బలమైన గాయమైంది. మరో ఇద్దరి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై చట్నీస్ హోటల్ యాజమాన్యం ఏవిధమైన అధికారిక ప్రకటన ఇవ్వకుండా, విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనతో హోటల్ సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.