mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:11 pm Digital Edition : Namastey Mahaaprabha

ఘోరం.. పిడుగుపాటుకు ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..

మార్కాపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మార్కాపురం ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లో వరుస పిడుగుపాటులు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిన్న(ఆదివారం) శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతిచెందారు. కాగా, నేడు మార్కాపురం జిల్లాలోనూ ఘోర విషాదం చోటు చేసుకుంది. పుల్లలచెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీపై పిడుగుపడింది. పిడుగుపాటుకు గురై కన్నయ్య(28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో..

ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బి.కేసుపురంలో భారీ వర్షం కురిసింది. అప్పటికే పొలం పనుల కోసం వెళ్లిన తల్లీకుమార్తె మడియ కృష్ణవేణి(35), మడియ యోగేశ్వరి(15) వర్షం కారణంగా చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో భారీ పిడుగుపడి వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే తిరుపతి జిల్లాలోనూ పిడుగుపాటు ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాళహస్తి మండలం కలవగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కల్లు గీసేందుకు వెళ్లిన కార్మికుడు వి.కామరాజ్(35)పై పిడుగుపడడంతో తుదిశ్వాస విడిచాడు. కామరాజ్‌ను వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.