mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 8:52 am Digital Edition : Namastey Mahaaprabha

గేమింగ్ పేరుతో రూ.5 వేల కోట్ల స్కామ్.. బయటపెట్టిన పోలీసులు.. : Mahaaprabha

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల భారీ స్కామ్‌ను పోలీసులు బయటపెట్టారు. డొల్ల కంపెనీలకు దాదాపు రూ.5 వేల కోట్లు మళ్లించినట్లు విచారణలో బయటపడింది..

హైదరాబాద్, ఫిబ్రవరి 9,మహాప్రభ : నగరంలో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ (Online Gaming Scam) గుట్టును పోలీసులు రట్టు చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. డొల్ల కంపెనీలకు రూ.5వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించారు. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు, రెంటెడ్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎగవేతకు ఎస్క్రో ఖాతాలను దుర్వినియోగం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫిన్‌టెక్ సంస్థలు, రేస్‌జీ-ఈటీ247 వంటి వెబ్‌సైట్ల ద్వారా అక్రమ దందా నడిచినట్లు బయటపడింది. బ్యాంకింగ్ ఏపీఐలను అక్రమంగా ఉపయోగించి, ఆడిట్‌కు దొరక్కుండా నిందితులు జాగ్రత్త పడ్డారని పోలీసులు తెలిపారు. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీ మొత్తాలు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్న ‘విగోఫిన్ డిజిటల్ సొల్యూషన్స్’ డైరెక్టర్లు వైఎస్ ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో ఈ స్కామ్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.