mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 6:49 am Digital Edition : MAHAA PRABHA DAILY

గుజరాత్‌ కాండ్లా పోర్టుకు వస్తున్న మరో రెండు నౌకలు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక విజయాన్ని సాధించింది. భారీ ఎల్‌పిజి నౌక శివాలిక్ నిన్న గుజరాత్‌కు రాగా, నేడు ఎల్‌పిజి నౌక నందా దేవి, క్రూడ్ ఆయిల్ నౌక జగ్ లాడ్కీ గుజరాత్ పోర్టుకు వస్తున్నాయి.

మార్చి 17 మహాప్రభ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు క్లిష్టంగా మారాయి. ఇలాంటి సమయంలో, ఈ కీలక మార్గాన్ని దాటుకుని మూడు భారత నౌకలు గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి (LPG)తో వస్తున్న భారత నౌక ‘నందా దేవి’ నేడు గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకోనుంది. దీంతో పాటు, హోర్ముజ్ జలసంధి దాటి భారత క్రూడ్ ఆయిల్ నౌక ‘జగ్ లాడ్కీ’ 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో గుజరాత్ పోర్టుకు వస్తోంది.ఇవాళ వస్తున్న నందా దేవి నౌక, నిన్న ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌకలు కలిసి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజి మోసుకొస్తున్నాయి. ఫలితంగా సుమారు 65 లక్షల గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు భారత్‌కు చెందిన జగ్ లాడ్కీ నౌక 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో గుజరాత్ పోర్టుకు వస్తుండటం శుభపరిణామం.
భారత నౌకాదళం (Indian Navy) పర్యవేక్షణలో, ఇంకా దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఈ నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి. వచ్చిన కంటైనర్లను వాడినార్ (Vadinar) వద్ద చిన్న నౌకల్లోకి మార్చి, అక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. గత కొన్ని వారాలుగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలు పెరిగాయనే ఆందోళనలు ఉన్నాయి. ఈ నౌకల రాక మార్కెట్‌ను స్థిరీకరించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో గ్యాస్ సరఫరా వేగవంతం అయ్యే అవకాశం ఉంది.