mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 6:48 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఖమేనీ మృతిపై భారత్ మౌనం.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనియా గాంధీ..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి సంబంధించి భారత్ మౌనంపై సోనియా గాంధీ స్పందించారు. కేంద్రంపై ఆమె విమర్శలు చేశారు. ఖమేనీ హత్యను కేంద్రం ఖండించకపోవటం తటస్థ వైఖరి కాదని, బాధ్యతలను విస్మరించటమేనని అన్నారు.

న్యూఢిల్లీ, మార్చి 3 మహాప్రభ : అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై శనివారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న(సోమవారం) తుదిశ్వాస విడిచారు. ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీరెజా అరాఫీ నియమితులయ్యారు.

కేంద్రంపై సోనియా గాంధీ విమర్శలు..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి యుద్ధం ఆపాలని కోరారు. ఏదైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ మృతికి సంబంధించి భారత్ మౌనంపై సోనియా గాంధీ స్పందించారు. కేంద్రంపై ఆమె విమర్శలు చేశారు. ఓ జాతీయ మీడియాతో సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు’..‘ఈ విషయాన్ని మార్చి 1వ తేదీన ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో సుప్రీం లీడర్‌ను హత్య చేయటం అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీయటమే. అమెరికా, ఇజ్రాయెల్ నరమేధాన్ని భారత ప్రధాని పట్టించుకోవటం లేదు. కానీ, యూఏఈపై ఇరాన్ దాడులను మాత్రం ఖండిస్తున్నారు. ఈ దాడులకు దారి తీసిన సంఘటనల గురించి మాట్లాడటం లేదు. ఖమేనీ హత్యను ఖండించకపోవటం తటస్థ వైఖరి కాదు. బాధ్యతలను విస్మరించటమే. కేంద్రం తీరు వల్ల భారత్ విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు కలుగుతాయి’ అని అన్నారు.