mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 6:21 am Digital Edition : Namastey Mahaaprabha

క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నం ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన చిన్నపాటి వివాదం.. ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్న సమయంలో పెదగదిలి జంక్షన్ పరిధిలోని ఒక గ్రౌండ్‌లో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే డోల అజిత్, కిషోర్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే తోటి స్నేహితుల చొరవతో ఇద్దరి మద్య వివాదం సద్దుమణిగింది

ఆదివారం సాయంత్రం సమయంలో కిషోర్ పక్కా పథకం ప్రకారం కత్తితో పెద్దగదిలి జంక్షన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న అజిత్ అతని స్నేహితులను పిలిచి మళ్లీ వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరగడంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్ ఛాతిపై బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అజిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అజిత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మరో యువకుడికి సైతం తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హత్య అనంతరం నిందితుడు కిషోర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.