mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 5:48 am Digital Edition : Namastey Mahaaprabha

క్యాతనపల్లి ఎన్నిక సజావుగా జరిగేలా చూడండి: బాల్క సుమన్

క్యాతనపల్లిలో తమపై రాళ్ల దాడి చేశారని.. తనను జైలుకు పంపారని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు.

కరీంనగర్ ఏప్రిల్ 4 (మహాప్రభ) : క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. క్యాతనపల్లిలో తమ మీద రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. మంత్రి వివేక్ చెక్‌ బుక్ తీసుకెళ్లి తమ నేతలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘నన్ను జైలుకు పంపారు.. క్యాతనపల్లిని రావణ కాష్టం చేశారు’ అంటూ ఫైర్ అయ్యారు. కౌన్సిలర్లకు మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారన్నారు.

51 రోజులుగా ఊరికి దూరంగా, పండగలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారని విమర్శించారు. క్యాతనపల్లిలో వందల మంది పోలీసులు మోహరించారన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని బాల్క సుమన్ కోరారు.

నేడు బీఆర్‌ఎస్ డే: గంగుల కమలాకర్

ప్రజాస్వామ్యాన్ని క్యాతనపల్లి కౌన్సిలర్లు కాపాడారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి వివేక్ ప్రజాస్వామ్యన్ని కాపాడాలని.. ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివేక్ చూడాలన్నారు. ఈరోజు బీఆర్‌ఎస్‌ డే అని.. మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికపై ఉత్కంఠ…

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం బీఆర్ఎస్, సీపీఐ కూటమి – కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. దాదాపు 650 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఎన్ఎస్ 163యాక్ట్ అమలులో ఉండనుంది. మున్సిపల్ కార్యాలయం వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.