mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:07 pm Digital Edition : Namastey Mahaaprabha

కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ

కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.

విశాఖపట్నం ఏప్రిల్ 6 (మహాప్రభ) : కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒడిశా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వివరించింది.

ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, అల్లూరి సీతారామరాజు మన్యం, తూర్పు గోదావరితోపాటు ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. దీంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు స్పష్టం చేశారు. అలాగే గాలుల తీవ్రత దృష్ట్యా పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ వద్దని హెచ్చరించారు.

ఆదివారం శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు మరణించగా.. ఈ రోజు (సోమవారం) మార్కాపురంలో ఒకరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.