mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 11:32 am Digital Edition : Namastey Mahaaprabha

కొత్తిమీర విషయంలో గొడవ.. కస్టమర్‌పై కత్తితో దాడి..

కొత్తిమీర కట్ట విషయంలో జరిగిన గొడవ.. చివరకు దారుణానికి దారి తీసింది. కస్టమర్‌పై కూరగాయల షాపు యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో మంగళవారం చోటు చేసుకుంది..

ముంబై, ఫిబ్రవరి 26 మహాప్రభ : కొత్తిమీర కట్ట విషయంలో జరిగిన గొడవ దారుణానికి దారి తీసింది. 20 రూపాయల కొత్తిమీర కట్టకు 10 రూపాయలు ఇస్తాననటంతో షాపు యజమాని, కస్టమర్‌కు మధ్య గొడవ జరిగింది. కస్టమర్‌పై కూరగాయల షాపు యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ కస్టమర్ ఆస్పత్రి పాలయ్యాడు. పరారీలో ఉన్న కూరగాయల షాపు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన శ్రీనివాస్ కంబ్లే అనే వ్యక్తి కుర్లా ప్రాంతంలో కూరగాయల స్టాల్ పెట్టుకున్నాడు. మంగళవారం ఓ కస్టమర్ అతడి షాప్ దగ్గరకు వచ్చాడు. కొత్తిమీర విషయంలో శ్రీనివాస్ కంబ్లే‌తో ఆ కస్టమర్‌కు గొడవ జరిగింది. వ్యాపారి శ్రీనివాస్ కొత్తమీర కట్ట ధర 20 రూపాయలు అని చెప్పాడు. అయితే ఆ కస్టమర్.. కొత్తిమీరకు 10 రూపాయలే ఇస్తానని తేల్చి చెప్పాడు. తనకు కూరగాయల ధరలు బాగా తెలుసునని, అదే ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఉంటున్నానని అన్నాడు. దీంతో మొదలైన గొడవ చివరికి చిలికిచిలికి గాలివానలా మారింది.దీంతో ఆగ్రహానికి గురైన కంబ్లే కొత్తితో కస్టమర్‌పై దాడి చేశాడు. శ్రీనివాస్ దాడిలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం శ్రీనివాస్ అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డ కస్టమర్‌ను స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వీబీ నగర్ పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుడి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.