mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 11:58 am Digital Edition : Namastey Mahaaprabha

కారం పొడి కొనేలోపు రూ.2 లక్షలు మాయం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సినీ ఫక్కీలో రెండు లక్షలు చోరీ ఘటన కలకలం రేపుతోంది. రషీద్ పటేల్ అనే వ్యక్తి బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని బైక్‌పై వెళ్తున్నారు.

కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 8 (మహాప్రభ) : ఎల్లారెడ్డిలో సినీ ఫక్కీలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. రషీద్ పటేల్ అనే వ్యక్తి బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌ డ్రా చేసుకుని బైక్‌ కవర్‌లో పెట్టుకోగా.. ఎంతో చాకచక్యంగా డబ్బును కొట్టేశాడు దొంగ. ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన రషీద్ పటేల్ తన అవసరాల కోసం యూనియన్ బ్యాంక్‌లో రెండు లక్షల రూపాయలు విత్‌డ్రా చేసుకున్నారు. ఆ మొత్తాన్ని బైక్ సీటు కవర్ లోపల పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు.

కారం పొడి కొనేందుకు ఒక చిన్న షాపు వద్ద బైక్ ఆపారు రషీద్. బైక్‌ను లాక్ చేయకుండానే షాపులోకి వెళ్లగా.. అదే అదునుగా భావించిన దొంగ బైక్ కవర్ తెరిచి డబ్బు ప్యాకెట్‌ను కొట్టేశాడు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు రషీద్. బ్యాంక్ నుంచే దొంగ తనను వెంబడించినట్లు బాధితుడు రషీద్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వీలైనంత త్వరగా దొంగను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.