mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:50 am Digital Edition : MAHAA PRABHA DAILY

కదలకుండా నిలబడిపోయిన డెలివరీ బాయ్.. 2 గంటల పాటు నోట్లో బీడీతో..

ఓ వ్యక్తి జాంబీ డ్రగ్ తీసుకున్న వాడిలా వింతగా ప్రవర్తించాడు. నిల్చున్న చోటే 2 గంటల పాటు కదలకుండా ఉండిపోయాడు. ఈ సంఘటన హర్యానాలోని చండీగఢ్‌‌లో బుధవారం చోటుచేసుకుంది.

ఇంటర్‌నెట్ డెస్క్ మార్చి 25 ( మహాప్రభ ) : అగ్రరాజ్యం అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. గ్జైలాజైన్ అనే డ్రగ్ వాడిన జనం జాంబీల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్తంభంలాగా ఓ చోట నిలబడి పోయి గంటలు, గంటలు కదలటం లేదు. తాజాగా, ఇండియాలో కూడా ఓ వ్యక్తి జాంబీ డ్రగ్ తీసుకున్న వాడిలా వింతగా ప్రవర్తించాడు. నిల్చున్న చోటే 2 గంటల పాటు కదలకుండా ఉండిపోయాడు. ఈ సంఘటన హర్యానాలోని చండీగఢ్‌‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం చండీగఢ్‌‌ నగరంలో బ్లింకిట్ డెలివరీ బాయ్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు.

ఈ నేపథ్యంలో బీడీ నోట్లో పెట్టుకుని చేతిలోని లైటర్‌తో దాన్ని అంటించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమైందో ఏమో తెలిదు కానీ, అదే పొజిషన్‌లో స్తంభంలాగా పక్కకు కదలకుండా నిలబడిపోయాడు. దాదాపు రెండు గంటలకు పైగా అతడు అలా నిలబడిపోయాడు. ఇది గమనించిన జనం ఆశ్చర్యపోయారు. కొంతమంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డెలివరీ బాయ్‌ని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. రిశు రాజ్ సింగ్ అనే వ్యక్తి సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.‘చండీగఢ్‌లో ఈ రోజు ఉదయం ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 33బీలో ఓ యువకుడు 2 నుంచి 2.5 గంటల పాటు పక్కకు కదలకుండా నిలబడిపోయాడు. అతడి నోట్లో ఓ బీడీ ఉంది. కళ్లు మూయటం లేదు. ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదన్నట్లు అతడి ప్రవర్తన ఉంది. ఇది చూసిన జనం భయపడిపోయారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అతడిని తీసుకెళ్లిపోయారు. మన నగరంలో నిజంగా ఏం జరుగుతోంది?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.