mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 8:47 am Digital Edition : Namastey Mahaaprabha

ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. : Mahaaprabha

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆరోపించారు.

చెన్నై ఫిబ్రవరి 7 మహాప్రభ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(Nainar Nagendran) ఆరోపించారు. తిరునల్వేలిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, ఉపాధి తదితర రంగాల్లో ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ప్రస్తుతం మాదకద్రవ్యాల మత్తులోతూలుతోందని విమర్శించారు. 2021 ఎన్నికల్లో లాగే అచరణకు సాధ్యంకాని హామీలు గుప్పించి డీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో ఓటర్లకు నగదు పంపిణీ చేయనుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందాలనే పొంగల్‌ కానుకగా ఈ ఏడాది ఒక్కొక్క రేషన్‌కార్డుకు రూ.3వేల చొప్పున నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు 33 లాకప్‏డెత్‌లు జరిగాయని, సక్రమంగా పన్నులు చెల్లిస్తున్న ప్రజానీకానికి కనీస వసతులు కల్పించడంలో కూడా ఈ మోడెల్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. మదురైలో మార్చి 1న ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న బహిరంగ సభ మహానాడులా నిర్వహించనున్నట్లు నాగేంద్రన్‌ వెల్లడించారు.