పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జింబాబ్వే పేసర్ ముజరబానిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుందని సమాచారం. ముజరబానీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరనుండమే కారణంగా తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్ మార్చి14 మహాప్రభ : ఐపీఎల్2026లో పాల్గొనేందుకు చివరి నిమిషంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ముజరబానీ(Blessing Muzarabani ) పీఎస్ఎల్లోకి వెళ్లేందుకు రూ.1.10 కోట్లతో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.అయితే అనూహ్యంగా ఐపీఎల్(IPL)లో అవకాశం రావడంతో పీఎస్ఎల్ను వీడాలని నిర్ణయించుకున్నాడు. మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో ముజరబానీని తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లో ముజరబాని 13 వికెట్లు సాధించాడు. జింబాబ్వే సూపర్-8కి చేరడంలో ముజరబాని కీలక పాత్ర పోషించాడు. మార్చి 17న కేకేఆర్ జట్టులోకి చేరనున్నాడు.
మరోవైపు పీఎస్ఎల్(PSL) ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాడు ఐపీఎల్ జట్టులో చేరడం ఇది వరుసగా రెండోది. గత సీజన్లో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కార్బిన్ బాష్ను పెషావర్ జల్మీ ఫ్రాంచైజీ డైమండ్ పిక్గా ఎంపిక చేసింది. అయితే అనూహ్యంగా ఐపీఎల్ జట్టైన ముంబై ఇండియన్స్లో చేరాడు. పీఎస్ఎల్ నుంచి బాష్ వైదొలగడంతో లీగ్ అతనిపై ఒక సీజన్ నిషేధం విధించింది.