mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:14 am Digital Edition : Namastey Mahaaprabha

ఏసీ వాటర్ వివాదం.. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి

ఏసీ వాటర్ పడుతున్నాయనే కారణంగా అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

కాకినాడ ఏప్రిల్ 10 (మహాప్రభ) : చిన్న, చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాల్లో కూడా కత్తులు, రాడ్లతో దాడులకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనల్లో కొందరు గాయాలపాలై బయటపడుతుండగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్న పరిస్థితి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏసీ వాటర్ విషయంపై తలెత్తిన చిన్న వివాదం.. దాడిగా మారి.. ఇద్దరిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది.

జగ్గంపేట మండలం నెహ్రూ కాలనీలో ఓ ఇంటి వాకిలిలో ఏసీ నుంచి వచ్చే వాటర్ పడుతుందన్న కారణంగా పక్కంటి మహిళ, ఆమె అన్నపై తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. అన్నాచెల్లెలిపై బ్లేడ్‌తో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. మొదట ఈ వివాదం చిన్నగా మొదలైనప్పటికీ తరువాత చిలికి చిలికి గాలివానగా మారింది. ఆగ్రహంతో తండ్రీకొడుకులు కలిసి పక్కంటి మహిళ, ఆమె అన్నపై బ్లేడ్‌తో విచాక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఇద్దరికీ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీ వాటర్ విషయంలో తండ్రీకొడుకులు ప్రవర్తించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.