mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 7:22 am Digital Edition : Namastey Mahaaprabha

ఏపీకి మేం సహకరిస్తున్నామా?

నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు.

  • నీళ్లపై చౌకబారు ఆరోపణలు చేయొద్దు
  • తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినవారు అలాంటి పనిచేస్తారా?: రేవంత్‌రెడ్డి

వరంగల్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 23  మహాప్రభ : నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా అని నిలదీశారు. ఏపీ నుంచి వలసవచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉం డదన్నారు. ఆ రాష్ట్రంలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ప్రాజెక్టును సందర్శించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాలపైనే గాక కృష్ణా జలాలపైనా అనేక అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ర్టానికి నీటిని తరలించడానికి తాము సహకరిస్తున్నామని అంటున్నారని తప్పుబట్టారు. ‘కృష్ణా జలాలపై శాసనసభలోనే పూర్తి స్థాయి చర్చ చేపట్టాం. బహిరంగ సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ హయాంలో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది.. రెండేళ్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చర్చించేందుకు అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం. కృష్జా జలాలకు సంబంధించిన అంశాలపై మొన్నటి సభలో వివరణ ఇచ్చాం. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు చేయడం సబబు కాదు. మీరు తప్పు చేశారా లేదా అన్నది ప్రజలు గుర్తించారు.. శిక్షించారు. గోదావరి జలాలపై సభలో కూర్చుని చర్చ చేద్దాం. మేం ఏదైనా సవరించుకోవాల్సి ఉంటే అందుకు అభ్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు చదవాలని, చిన జీయర్‌స్వామి సూక్తులు, మంచి ప్రవచనాలు వినాలని సూచించారు. అంతేతప్ప ప్రజలపై విషం కక్కవద్దని.. తమ వారసత్వ ఆస్తిని ఎవరో కొల్లగొట్టారన్నట్లుగా కడుపులో బాధ పెట్టుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.