mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 12:08 pm Digital Edition : Namastey Mahaaprabha

ఉద్దేశపూర్వకంగానే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ దాడి: నిరంజన్ రెడ్డి

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి, పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.

హైదరాబాద్ ఏప్రిల్ 16 (మహాప్రభ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) తీవ్రంగా ఖండించారు. తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి, పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటం ఫలితంగా తెలంగాణ సాక్షాత్కరించిందని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

మిడిమిడి జ్ఞానం, అవగాహన లోపంతో బీజేపీ ఎంపీలు తెలంగాణ ఏర్పాటు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.