గ్రేటర్లో కాలుష్యరహిత ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)గా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్’ సాంకేతికతపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది.
- రెట్రో ఫిట్మెంట్ సాంకేతికతతో మార్పు
- 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులే లక్ష్యం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 మహాప్రభ: గ్రేటర్లో కాలుష్యరహిత ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)గా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్’ సాంకేతికతపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేట్ సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ప్రస్తుతం ఆ ఎలక్ట్రిక్ బస్సు ఉప్పల్ డిపో(Uppal Depot) పరిధిలో విజయవంతంగా నడుస్తోందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డు సాధించిందని ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు.బస్భవన్లో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, రెట్రో ఫిట్మెంట్ విధానంపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 నాటికి గ్రేటర్ ఓఆర్ఆర్ లోపల 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, విజయపుష్ప, సాయు గ్రీన్ మొబిలిటీ కల్యాణీ, పవర్ ట్రైన్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
