mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 9:13 am Digital Edition : Namastey Mahaaprabha

ఇరుదేశాలకు గ్రేట్ న్యూస్.. ట్రంప్‌నకు కృతజ్ఞతలు: మోదీ : Mahaaprabha

భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ఇది గొప్ప వార్త అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకుధన్యవాదాలు తెలిపారు మోదీ.

ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 7 మహాప్రభ : భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు(PM Modi on US trade deal). ఇరుదేశాలకు ఇది గొప్పవార్త అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు మోదీ.‘భారత్‌, అమెరికాలకు ఇది గ్రేట్ న్యూస్. ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్‌ వర్క్‌ ఖరారు చేశాం. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాల కోసం, వ్యక్తిగత నిబద్ధతతో కృషిచేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు. తాజా ఒప్పందం మన(భారత్, అమెరికా) భాగస్వామ్యం, పెరుగుతున్న నమ్మకం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అమెరికాతో కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం భారత్‌లోని వ్యవసాయదారులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. ఇది ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీనిద్వారా మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.తాజా ఒప్పందం నేపథ్యంలో భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వాషింగ్టన్ డీసీ పేర్కొంది. తమ దేశం నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్‌ అంగీకరించిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ తెరుస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌ పేర్కొన్నారు. దీన్ని చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు.