mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:08 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి

సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనే మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారంనాడు ప్రకటించారు.

టెహ్రాన్ మార్చి 18 మహాప్రభ : సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనే మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ (Esmail Khatib) మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారంనాడు ప్రకటించారు. ఇరాన్ సీనియర్ అధికారులు ఎవరినైనా సరే ఎలాంటి అదనపు అనుమతులు అవసరం లేకుండా మట్టుబెట్టాలని మిలటరీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు స్వేచ్ఛనిచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే ఇస్మయిల్ ఖతీబ్ మృతి వార్తలను ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు.
కాగా, ఇస్మయిల్ ఖతీబ్‌ మృతికి ఒక రోజు ముందే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆయనతో పాటు ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) పారామిలిటరీ దళం ‘బసిజ్‌ ఫోర్స్‌’ కమాండర్‌ గోలం రెజా సోలేమానీ, పెద్ద సంఖ్యలో మిలిటరీ ఉన్నతాధికారులు తమ దాడుల్లో మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆదేశంలోని 100 టార్గెట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించే ప్రతిపాదనను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చారు. శాంతికి ఇది సమయం కాదని, ఓటమిని అంగీకరించి నష్టపరిహారం ఇచ్చేంతవరకూ అమెరికా, ఇజ్రాయెల్‌తో శాంతి కుదరదని చెప్పారు.